టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై వేటుకు రంగం సిద్దమైంది. త్వరలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకే ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని టీమిండియాకు అందించిన కెప్టెన్ సూర్య కుమార్కు బిగ్ షాక్ తగలనున్నట్లు సమాచారం. జూన్, జూలైలో జరగనున్న ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకే ముందే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. చాలాకాలం నుంచి ఈ ముంబై స్టార్ ఫామ్ లేమితో సతమతం అవుతున్నాడు. ఒకప్పుడు టీ20 ప్రపంచ నంబర్ వన్గా కొనసాగిన ఈ మిస్టర్ 360.. ఇప్పుడు హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోవాడానికి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026లోనూ అతడి ప్రదర్శన దారుణంగా ఉంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న సూర్య.. 13 ఇన్నింగ్స్లలో 270 పరుగులు మాత్రమే చేశాడు. 2017 తర్వాత సూర్యకుమార్కు అత్యంత పేలవమైన ఐపీఎల్ సీజన్ ఇదే కావడం గమన్హారం. ఈ క్రమంలోనే అతడి స్థానంలో కొత్త కెప్టెన్ను నియమించాలని బోర్డు భావిస్తోంది. కెప్టెన్గానే కాకుండా ఏకంగా అతడిని జట్టు నుంచి తప్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లతో బీసీసీఐ చర్చలు జరిపినట్లు సమాచారం. కొత్త సారథి ఎంపిక ప్రక్రియ ప్రారంభించమని వారికి బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త సారథి పేరును అధికారికంగా ప్రకటించనుంది.
‘ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో సెలక్షన్ కమిటీ, బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ చర్చించి.. భవిష్యత్ లో జరిగే టీ20 మ్యాచుల్లో భారత జట్టు కొత్త కెప్టెన్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. సూర్య కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, అతడి ఫామ్ దృష్టిలో ఉంచుకుని బోర్డు కొత్త కెప్టెన్ను ఎంపికకు సిద్దమైంది. ఈ విషయాన్ని త్వరలోనే అతనికి స్పష్టం చేస్తాం” అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’తో పేర్కొన్నారు. కాగా కెప్టెన్సీ రేసులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లతో పాటు హైదరాబాదీ తిలక్ వర్మ పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
